రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం క్యాతనపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి వివేక్ వెంకటస్వామి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని అక్రమంగా దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను బీఆర్ఎస్-సిపిఐ కూటమి 14 వార్డుల్లో విజయం సాధించిందని, కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితమైందని సుమన్ గుర్తుచేశారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, ఏదో రకంగా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే భద్రాచలం వెళ్లిన తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగిందని ఆయన పేర్కొన్నారు.మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ , స్థానిక పోలీసులు మంత్రికి ‘తొత్తులు’గా వ్యవహరిస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న తమ కౌన్సిలర్లను గంటల తరబడి రోడ్లపై ఆపి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని ఆరోపించారు. మంత్రి వివేక్ ఇంటి పనిమనుషుల లాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని అన్నారు.కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.
మున్సిపల్ కౌన్సిల్ హాల్లోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం సేవించి వచ్చి, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యం చేశారని, అక్కడ ‘దుశ్శాసన పర్వం’ జరిగిందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధులను తాకడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలపై మహిళా కమిషన్, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.తనపై ,కార్యకర్తలపై అటెంప్ట్ మర్డర్ వంటి అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “బాల్క సుమన్ జైలుకు వెళ్తే మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చని మంత్రి కలలు కంటున్నారు. అక్రమ కేసులకు నేను భయపడను. ఇప్పటికే బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉన్నాను” అని సవాలు విసిరారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిని బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు.అభివృద్ధి పనులు నిలిపివేత
గత ప్రభుత్వ హయాంలో తాను మంజూరు చేయించిన బస్ డిపో, 100 పడకల ఆసుపత్రి, చెన్నూరు ఎత్తిపోతల పథకం వంటి పనులను మంత్రి వివేక్ కావాలనే నిలిపివేశారని సుమన్ ఆరోపించారు. అభివృద్ధిని పక్కనపెట్టి కక్ష సాధింపు రాజకీయాలే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.
క్యాతనపల్లి ప్రజలు తమ పక్షాన ఉన్నారని, నేటి బంద్ విజయవంతం కావడమే దానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు.
