తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిణామంపై రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దేవస్థానాల మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుత చైర్మన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ వివాదం కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాదని, హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన.. భూమన కరుణాకర్ రెడ్డి, తాజాగా బయటకు వచ్చిన దృశ్యాలు హిందువుల హృదయాలను కలచివేశాయని పేర్కొన్నారు. 94 సంవత్సరాల దేవస్థానాల పాలక మండలి చరిత్రలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి చైర్మన్గా కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ స్వయంగా తప్పుకోవాల్సిందని సూచించారు. దీనిని ఒక రాజకీయ పార్టీపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే చర్యగా కనిపిస్తోందని ఆరోపించారు.
తమ నాయకుడు వైఎస్ జగన్పై, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన పరిణామాలను దైవ శిక్షగా భావిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పవనానంద స్వామి, ఓ మహా పురుషా.. దీనిపై స్పందించండి. బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. చరిత్రలో ధార్మిక వ్యవస్థలను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయని, అదే విధంగా ఈ వ్యవహారంలో కూడా స్పష్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేవస్థానాల ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అంశాన్నైనా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.
వీడియోలు సాంకేతికంగా సృష్టించినవని చెబుతున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. తాను మాట్లాడిన కొంతమంది సాంకేతిక నిపుణుల ప్రకారం అవి అసలైనవేనని తెలిపారు. తప్పును ఒప్పుకుని మౌనంగా తప్పుకోవడం మంచిదని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవస్థానాల కార్యాలయ ప్రతిష్ఠను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది
ALSO READ: ఎంతపని చేశావక్కా.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఊహించని పనిచేసిన నవ వధువు
