Homeతెలంగాణతెలంగాణ కాంగ్రెస్ కు కీలక బాధ్యతలు...!

తెలంగాణ కాంగ్రెస్ కు కీలక బాధ్యతలు…!

  • కేరళలో సానుకూల ఫలితాలు వస్తే ఏఐసీసీలో నలుగురు నేతలకు చోటు

  • జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి

  • మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కేరళలో యుడిఎఫ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఒపీనియన్ పోల్స్, ప్రీ పోల్స్ లో అధికార ఎల్డీఎఫ్కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తేలింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు డి ఎఫ్ విజయం సాధిస్తే మాత్రం దేశవ్యాప్తంగా పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ హస్తవాసి పనిచేస్తుందని ఏఐసీసీ ఒక నమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలకు జాతీయ కమిటీలు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ పిసిసికి హై కమాండ్ నుంచి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

కేరళలో విస్తృత ప్రచారం..
కేరళలో స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. ఇతర మంత్రులు సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా కేరళ సీఎం పినరాయి విజయన్, రేవంత్ రెడ్డి ల మధ్య జరిగిన మాటల యుద్ధం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు యూడిఎఫ్ కూటమికి ప్లస్ గా నిలుస్తున్నాయి. అందుకే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అధికారంలోకి వస్తే అది తెలంగాణ నేతల వ్యూహాలకు దక్కిన విజయంగా ఏఐసీసీ గుర్తించే ఛాన్స్ ఉంది.

ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అనుసరించే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆ పార్టీ సిద్దపడుతుంది. అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతి రాష్ట్రంలోనూ ఆరు గ్యారెంటీలు, ఇతర ప్రభుత్వ పాలసీలపై ప్రచారం చేయడానికి ప్రత్యేక టీం ను తెలంగాణ నుంచి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ అనేది కీలకంగా మారనుందన్నమాట.

ప్రత్యేక బృందం ఏర్పాటు..
కేరళ ఫలితాల అనంతరం ఏర్పాటు చేసే ఏఐసీసీ సమన్వయ కమిటీల్లో తెలంగాణకు చెందిన కనీసం నలుగురు నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తరహాలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేరళ ఫలితాలు సానుకూలంగా వచ్చిన మరుక్షణం తెలంగాణ నేతల ఆధ్వర్యంలో ఈ బృందం ఏర్పాటు కానుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ సీఎం గానే కాదు.. దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ క్యాంపెయినర్ గా మారనున్నారు. ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

నేతల ప్రచారానికి సానుకూల ఫలితాలు
గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు పాత్ర పోషించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తెలంగాణ మంత్రులు ప్రచారం చేశారు. అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి సానుకూలత వచ్చింది.

ప్రస్తుతం కేరళలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను ఒక వ్యూహం ప్రకారం అక్కడ అమలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి వీడియోలను ఆయా రాష్ట్రాల భాషల్లోకి అనువదించి ప్రచారం చేస్తున్నారు. ఇవి మంచి ఫలితాలు ఇస్తాయని జాతీయ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే మున్ముందు తెలంగాణ కాంగ్రెస్ సేవలను ఏఐసీసీ స్థాయిలో వాడుకోవాలని హైకమాండ్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు