ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా.. బీజేపీలో కీలక పదవి దక్కే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జగన్ కు ఝలక్ ఇస్తూ రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు.కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ ప్రకటించారు.

రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు.తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీజేపీలో చేరడానికే ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం పెద్దలతో ఆయన సంప్రదింపులు జరిపారని అంటున్నారు. బీజేపీలో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న బీజేపీ.. ఇప్పటి నుంచే పక్కాగా ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు వల వేసిందనే టాక్ వస్తోంది.

వైసీపీ నుంచి పెద్దల సభకు ఎన్నికైన బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలతో రాజ్యసభలో వైఎస్సార్​సీపీ బలం 8కి పడిపోయింది. ఇదే బాటలో మరి కొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను వైఎస్సార్​సీపీ సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది.రాజ్యసభలో వందశాతం గెలిచాం.లోక్‌సభ, అసెంబ్లీలోనూ తెలుగుదేశం పార్టీని జీరో చేస్తామంటూ అప్పటీ సీఎం జగన్ అతని అనుచరులు ప్రగల్భాలు పలికేవారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం తరువాత వైఎస్సార్​సీపీ నుంచి వలసలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button