
ఏపీ లిక్కర్ స్కామ్ అనుకున్నదానిపై ఎక్కువ ప్రకంపనలే సృష్టిస్తోంది. ఈ కేసులో తీగ లాగిన సిట్ అధికారులు… దాదాపుగా డొంక కదిలిస్తున్నారు. వైఎస్ జగన్ చుట్టూ వారిని అరెస్ట్ చేశారు. రేపు ఈ కేసు జగన్ మెడకు చుట్టుకుందా…? లేక ఆయన భార్య భారతికి ఉచ్చు బిగుస్తుందా..? ఏమో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారు కొందరు జగన్ సన్నిహితులైతే.. కొందరు వైఎస్ భారతి వర్గానికి చెందిన వారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోటరీలో ఉండే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, OSD కృష్ణమోహన్రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం… ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వారిలో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి జగన్కు సన్నిహితులు. అయితే… మొన్న అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీ మాత్రం వైఎస్ భారతి మనిషి. ఆమె ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు గోవిందప్ప. ఆయన్ను అరెస్ట్ చేయడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవిత నిందితురాలుగా ఉన్నారు.. మరి ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా అలాంటి పరిణామమే జరుగబోతోందా…? ఏమో… వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప అరెస్ట్తో.. ఇప్పుడు ఈ చర్చే నడుస్తోంది.
గోవిందప్ప బాలాజీ… భారతి సిమెంట్స్ డైరెక్టర్. వైఎస్ జగన్ సతీమణి భారతికి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే నమ్మకస్తుడు. ఆయన అరెస్ట్.. వైసీపీకే కాదు.. జగన్కు కూడా షాకే. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలు వెల్లడించింది సిట్. లిక్కర్ సిండికేట్లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని… మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లైలో కూడా పాత్ర ఉందని గుర్తించామంది. అంతేకాదు.. గుర్తింపు పొందిన బ్రాండ్లను ఆపేయడంలోనూ గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని.. ఫలితంగా కోట్ల రూపాయలు ఆర్జించారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్. లిక్కర్ కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప సన్నిహితుడు. వీరిద్దరూ జగన్ కుటుంబానికి సన్నిహితులు. ఇక.. ఈ కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు… సూత్రధారులపై ఫోకస్ పెట్టబోతోంది సిట్. స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులు చివరికి ఎవరికి చేరాయి అన్నది తేల్చబోతోంది. ఈ క్రమంలో సిట్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు..? కీలక వ్యక్తినే అరెస్ట్ చేయబోతున్నారా…? అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.