హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాష్ర్టంలో యాసంగి(రబీ) సీజన్కు సంబంధించి వరి పంట కోతలు జోరందుకున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఐకపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను (IKP & PACS) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐకేపీ కేంద్రాల్లో ఎలాంటి జాప్యం జరుగకుండా కొనుగోలు చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రలు, ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు.
తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు తాగునీరు, నీడ కోసం టెంటు్ల, ధాన్యం ఎండబోయడానికి అవసరమైన టార్ఫాలిన్టు, సరిపడా గన్ని బ్యాగులు(గోనే సంచులు) సిద్దంగా ఉంచారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా లారీలను ఏర్పాటు చేయాలని, తద్వారా సెంటర్ల వద్ద ధాన్యం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున చెల్లిస్తున్నారు. తేమ శాతం: కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే ముందు అది 17% కంటే తక్కువ తేమ ఉండేలా ఎండబోయాలని అధికారులు కోరుతున్నారు. రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా వివరాలను వెంట తెచ్చుకోవాలని, దీనివల్ల సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని తెలిపారు.
మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా కొనుగోళ్ల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. రైతుల ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే రైతులు సంబంధిత వ్యవసాయాధికారిని లేదా కలెక్టరేట్లోని హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చునని కోరారు.
