
Woman incident: విశాఖపట్నం నగరం ప్రశాంతతకు పేరుగాంచిన ప్రాంతాల్లో ఒకటైన వేపగుంట అప్పన్నపాలెం ప్రాంతం శనివారం ఒక దారుణ హత్యతో కలకలం రేపింది. చినముషీడివాడకు చెందిన శ్రీనివాస్, విజయనగరానికి చెందిన దేవి కొంతకాలంగా సహజీవనం చేస్తూ, తమను భార్యాభర్తలమని ఇతరులకు చెప్పేవారు. వీరిద్దరూ ఇటీవల ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. బహిరంగంగా సామాన్య దంపతుల్లా కనిపించినా.. వారి మధ్య నెలకొన్న అంతర్గత వివాదాలు చివరికి ఘోరంగా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజు వీరిద్దరి మధ్య గొడవ చెలరేగింది. మొదట మాటల తాటిపై మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్.. దగ్గర్లో ఉన్న ఐరన్ కుర్చీని ఎత్తుకుని దేవిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారీ దెబ్బలతో దేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్య జరిగిన సమయాల్లో అపార్ట్మెంట్లో పనిచేసే మహిళా వాచ్మెన్ కొన్ని అనుమానాస్పద విషయాలు గమనించారు.
అపార్ట్మెంట్కు వచ్చినప్పుడు ప్రతి సారి శ్రీనివాస్ హెల్మెట్ ధరించి రావడం చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోయిందని పోలీసులు తెలిపారు. దేవితో గొడవ జరుగుతున్న సమయంలో ఆమె అరుపులు విని వాచ్మెన్ అపార్ట్మెంట్కు వెళ్లి విచారించగా, కుటుంబ సమస్య అంటూ శ్రీనివాస్ ఆమెను వెనక్కు పంపించాడు. అతి కొద్ది సేపటికే శ్రీనివాస్ ఆస్థలం విడిచి వెళ్లిపోయాడు. తరువాత ఫ్లాట్కు తాళం వేసి ఉండటాన్ని గమనించిన వాచ్మెన్, పలుమార్లు తలుపులు కొట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, రక్తపు మడుగులో పడి ఉన్న దేవి మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం, ఐరన్ కుర్చీతో ఆమెపై దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలు గుర్తించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖపట్నం పోలీసులు, శ్రీనివాస్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. దేవి మరణం వెనుక ఉన్న అసలు కారణాలు, వారి మధ్య ఎంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి వంటి అంశాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ALSO READ: Water: రాత్రిపూట మీరు ఇలా చేసినట్లయితే..





