
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించారు ఆగంతకులు. బాంబులు పెట్టామని.. కాసేపట్లో విమానాశ్రయం పేలిపోతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బందిని పోలీసులు బైటకు తరలించారు. స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ను అణువణువు గాలిస్తున్నాయి జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్ పర్ట్స్. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. బెదిరింపు కాల్ పై సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు చేస్తున్నారు.