నిలిచిపోనున్న ఉత్పత్తి
సంస్థకు భారీ ఆర్థిక నష్టం
విశాఖపట్టణం , క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోటళ్లు, చిరు వ్యాపారాలు, క్యాంటీన్లు, హాస్టళ్లతోపాటు గ్యాస్ అధారిత పరిశ్రమలు మూసి వేయాల్సి వస్తుంది. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పైన కూడ పడింది. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో మార్పులు రావడం, మన దేశీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను ఇబ్బందుల్లో పడేస్తోంది.
ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడానికి అత్యంత కీలకమైన ఎల్పీజీ సరఫరా నిలిచిపోయే పరిస్థితి రావడంతో మరో పది రోజుల్లో ఉత్పత్తి మొత్తం ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో స్టీల్ కంపెనీపై ఆధారపడి జీవించే వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థతి నెలకింది. దీంతో అధికారులు, కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
సంస్థకు భారీ ఆర్థిక నష్టం….
స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆగిపోతే సంస్థకు తీవ్ర నష్టం వాటిల్ల నుంది. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ అత్యంత కీలకమైన విభాగం. ఇక్కడ తయారైన స్టీల్ బ్లూమ్స్ అవసరమైన పరిమాణంలో కట్ చేయడానికి ఎల్పీజీని వినియోగిస్తారు. ప్రతి రోజూ సుమారు నాలుగు వేల బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లూమ్స్ కట్ చేస్తే బెడ్ ఖాళీ అవుతుంది. తద్వారా నిరంతరం కాస్టింగ్ ప్రక్రియ ఇబ్బంది లేకుండా సాగుతుంది.
ఈ కటింగ్ ప్రక్రియలో ఎల్పీజీకి వేరే ప్రత్యామ్నాయం లేదు కనుక గ్యాస్సరఫరా ఆగిపోతే కటింగ్ ఆపావల్సి వస్తుంది. దీంతో ప్లాంట్ మొత్తంలో ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ప్లాంట్ ప్రతి రోజూ ఉత్పత్తి చేసే పది వేల టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఆగిపోతుంది. సంస్థకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది. ప్లాంట్లో పనులు కోసం రోజుకు సుమారు 13 టన్నుల ఎల్పీజీ అవసరం.
తగ్గిపోతున్న గ్యాస్ నిల్వలు…
చముర సరఫరా నిలిపివేయడంతో ప్లాంట్లో ఉన్న గ్యాస్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ప్లాంట్లో మొత్తం 325 టన్నుల ఎల్పీజీని దాచుకునే సౌకర్యం ఉంది. ప్రస్తుతం ప్లాంట్లో నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 156 టన్నుల గ్యాస్ మాత్రమే ఉంది. ఉన్న నిల్వలు ప్రస్తుత వినియోగం ప్రకారం మరో పది రోజులకు సరిపోతాయి.
పది రోజుల తర్వాత గ్యాస్ రాకపోతే ప్లాంట్మూతపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని అధికారులు, కార్మిక సంఘాలు విశాఖ ఎంపీ భరత్కు వివరించారు. వెంటనే స్పందించిన భరత్ ఢిల్లీలోని కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్టీల్ ప్లాంట్కు గ్యాస్ సరఫరా నిలివేస్తే ఉత్పత్తి ఆగిపోతుందని వేల మందిపై ప్రభావం ఉంటుందని తెలియజేశారు. సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
