Valentines Day Trend: ఒకప్పుడు వాలెంటైన్స్ డే అంటే ఎర్ర గులాబీలు, ప్రేమ సందేశాలతో కూడిన కార్డులు, చిన్న చిన్న కానుకలే ముందుగా గుర్తుకు వచ్చేవి. ప్రేమను వ్యక్తపరచడానికి పూలే ప్రధాన ప్రతీకగా భావించేవారు. అయితే కాలం మారింది. యువత ఆలోచనల్లోనూ, వారి కొనుగోలు అలవాట్లలోనూ గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఈ ఏడాది ప్రేమికుల రోజు వేడుకల్లో సంప్రదాయ కానుకల కంటే వేరే వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత లభించినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
స్విగ్గీ ఇన్స్టామార్ట్ వెల్లడించిన తాజా డేటా ప్రకారం.. ఈసారి గులాబీలు, కానుకల కిట్లు కంటే ఇతర శృంగార అనుబంధ ఉత్పత్తులకే భారీగా డిమాండ్ నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రేమికులు ఈ రకమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ముఖ్యంగా బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నగరాలు ఈ జాబితాలో ముందంజలో నిలిచాయి. ఈ మూడు నగరాల్లోనే అత్యధిక ఆర్డర్లు నమోదు కావడం విశేషంగా మారింది.
అయితే కేవలం శృంగార అనుబంధ వస్తువులకే పరిమితం కాకుండా ఇతర విభాగాల్లోనూ మంచి స్పందన కనిపించింది. కండోమ్స్ తర్వాత చాక్లెట్లు రెండో స్థానంలో నిలవగా, టెడ్డీ బేర్లు మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ప్రేమను మధురంగా వ్యక్తపరచే చాక్లెట్లకు ఎప్పటిలాగే మంచి ఆదరణ లభించింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటు హైదరాబాద్, చెన్నై నగరాల్లోనూ చాక్లెట్లు, టెడ్డీ బేర్ల ఆర్డర్లు భారీగా నమోదయ్యాయి.
ఇక కోల్కతాకు చెందిన ఒక యువకుడు చేసిన కొనుగోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ప్రేయసి కోసం ఏకంగా రూ. 25 వేల విలువైన చాక్లెట్లను ఒకేసారి కొనుగోలు చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఈ ఏడాది ప్రేమికుల రోజు ఖర్చులు కూడా గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతోంది. మొత్తానికి ఈసారి ప్రేమికుల రోజు వేడుకల్లో యువత సంప్రదాయ పూల కానుకలకు కొంత దూరంగా నిలిచి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన వస్తువుల వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.
ALSO READ: Kondapindi leaf: కొండల్ని కూడా పిండి చేసే ఆకు.. కిడ్నీలో రాళ్లు ఓ లెక్కనా..?
