US Air Strikes In Nigeria: నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భారీగా దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై యూఎస్ శక్తిమంతమైన దాడులు ప్రారంభించింది. ప్రధానంగా అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్నవారిపై ఇవి జరిగాయి. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించా. నా హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించను’’ అని రాసుకొచ్చారు.
చనిపోయిన ఉగ్రవాదులకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు
అటు ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ హత్యాకాండ కొనసాగితే.. తమ దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడులు చేసి.. పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని అమెరికాకు చెందిన సైన్యాధికారి పేర్కొన్నారు.
నైజీరియాలోని మసీదు దగ్గర బాంబు పేలుడు
నైజీరియా ఐసిస్ అనుబంధ వర్గాలు, బోకో హరామ్ అనే తీవ్రవాద సమూహం నుంచి చాలా కాలంగా ఇబ్బందులు పడుతుఓంది. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది. అక్కడ క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడానికి నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు నవంబరులో ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు జరుగుతున్నాయి.





