ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కంటే చలాన్ల వసూళ్ల పైనే దృష్టి..!
ట్రాఫిక్ నియంత్రణను వదిలేసి, రోడ్ల మూలల్లో నక్కి ఫోటోలు తీయడం
వాహనాలను ఆపి గంటల తరబడి వేచి ఉండేలా చేయడం
ప్రజలను వేధించడం ఆపి, మిత్ర పోలీసులా వ్యవహరించాలి
సామాన్య వాహనదారుల ఆవేదన..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కంటే చలాన్ల వసూళ్ల పైనే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య వాహనదారుల అభిప్రాయం ప్రకారం…
హైదరాబాద్ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు తరచుగా ట్రాఫిక్ నియంత్రణను పక్కనపెట్టి, రోడ్ల మూలల్లో నక్కి లేదా నిలిచిన వాహనాలను ఫోటోలు తీయడం పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్య వాహనదారులను టార్గెట్ చేస్తూ, నిబంధనల పేరుతో భారీగా జరిమానాలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వాహన పత్రాలు అడిగే క్రమంలో కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కనీస గౌరవం ఇవ్వడం లేదని వాహనదారులు ఆరోపణలు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణను వదిలేసి, రోడ్ల మూలల్లో నక్కి ఫోటోలు తీయడం, వాహనాలను ఆపి గంటల తరబడి వేచి ఉండేలా చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు.
ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్లను రీచ్ అవ్వడానికే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నగరంలో సరైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించకుండా, రోడ్డు పక్కన కాసేపు ఆపిన వాహనాలను, పెట్రోల్ కోసం బంక్ లోకి వెళ్తున్న వాహనాలను అపి రాంగ్ రూట్ లో వస్తున్నావు అంటూ వారికీ ఇష్టం వచ్చినట్లు జరిమానాలు వేస్తూ అదనపు భారం మోపుతున్నారని జనం వాపోతున్నారు.
కొన్ని చోట్ల సిగ్నల్స్ సరిగ్గా పని చేయకపోయినా, పొరపాటున ముందుకు వెళ్లిన వారిపై కూడా కనికరం లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిసార్లు పాత చలాన్ల గురించి తెలియకపోవడం వల్ల వాహనదారులు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది వారిపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది.
“జరిమానాలు విధించడం తప్పు కాదు, కానీ అది కేవలం ఆదాయ వనరుగా మారకూడదు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంపై, రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలి. ప్రజలను వేధించడం ఆపి, మిత్ర పోలీసులా వ్యవహరించాలి” అని వాహనదారులు కోరుతున్నారు.
