జాతీయం

ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్న మోడీ, డ్రామాలొద్దన్న ఖర్గే!

BJP vs Congress: నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. రాజ్యంగంలో పొందుపరిచిన విలువలను కాలరాస్తూ, పౌరుల హక్కులను హరించివేసిందన్నారు. ప్రతికా స్వేచ్ఛను హరించడంతో పాటు నాయకులు, ప్రముఖులు, విద్యార్థులు, పౌరులను జైల్లో వేసిందన్నారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేసిందన్నారు. ఇందిరా ఎమర్జెన్సీని ఏ పౌరుడూమర్చిపోలేడని మోడీ వెల్లడించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అప్పట్లో స్వీయ అనుభవాలను, సంఘటనలు సంకలనం చేస్తూ తెచ్చిన ‘ది ఎమర్జెన్సీ డైరీస్-ది ఇయర్స్‌ దట్‌ ఫోర్జ్‌డ్‌ ది లీడర్‌’ అనే పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించారు. దీనిని బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని, కీలకమైన ఘటనలను వివరిస్తుందన్నారు ప్రధాని. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో తాను  ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నట్లు తెలిపారు. రాజ్యంగ బద్ధంగా దక్కాల్సిన హక్కలకు దూరమై, భయంకరమైన పరిస్థితులను అనుభవించిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రధాని సూచించారు.

కేంద్రం డ్రామాలు ఆడుతుందన్న కాంగ్రెస్  

అటు ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ వేడుకలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీపై నాటకాలు ఆడుతుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. జాతీయోద్యంలో, రాజ్యాంగ రచనలో భాగస్వామ్యం లేని వారు, రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ను తిరస్కరించిన వారు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ఘటనను కొత్తగా తెర మీదికి తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎమర్జెన్సీని రాజ్యాంగ హత్యాదినంగా అభివర్ణిస్తూ బీజేపీ నాటకాలడుతోందని ఆయన మండిపడ్డారు. మోడీ, ఆయన ప్రభుత్వం కారణంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఖర్గే విమర్శలు గుప్పించారు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. భారత్ తటస్థ వైఖరికి కారణమేంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button