- పోలీసుల లాఠీ ఛార్జ్
- పలువురికి గాయాలు
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆరఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. మరో వైపు నుంచి ఎంపీ వంశీకృష్ణ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు.
ఈ క్రమంలో బీఆరఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతోదాడులు చేసుకున్నారు. ఇరువర్గాల వారికి సంబందించి కొంత మందికి తలలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరకొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా ఈ ఘటనలతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీఆర్ ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తూ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
కాగా చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళుతున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బిఆరఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై ఎమ్మెల్యే కోవా లక్క్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.మరోవైపు పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు పన్నిందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపించారు.
