* ఏడేళ్ల జైలు శిక్ష
* తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాక్ స్వాతంత్రం పేరుతో నోరు పారేసుకునే వారికి గట్టి హెచ్చరిక నే పంపింది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, మతాలు, కులాల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు, కామెంట్లు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. ఏడేళ్ల జైలు శిక్ష వేసేలా కొత్త చట్టం తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించింది. సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
అనుచిత పోస్టులపై ఫిర్యాదులు..
గత కొంతకాలం గా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజలతోపాటు ప్రభుత్వాలు, వ్యవస్థలతో పాటు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినడంతో పాటు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో సోషల్ మీడియా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇదే తరహా ఆలోచనలో ఉండడం.. ఇప్పుడు అదే తరహా పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
అసభ్యకర పోస్టులే అధికం..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అయితే పోలీసుల అరెస్టు పర్వం కొనసాగుతున్న ఇంకా అటువంటి అసభ్య పోస్టులు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఏపీలో మొన్న ఆ మధ్యన భారీ స్థాయిలో అరెస్టులు జరిగాయి. దీంతో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తగ్గాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు సెన్సార్ తప్పనిసరి అని.. బాధ్యతగా వాడాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రాజకీయ సిద్ధాంతాలను విమర్శించవచ్చు కానీ.. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవద్దని గట్టిగానే చెబుతోంది. మరి ఈ చట్టం సోషల్ మీడియాను ఎంతవరకు కట్టడి చేయగలదో చూడాలి.
