
ఒక ఒరలో రెండు కత్తులే ఇమడవు… మూడు కత్తులను ఇరికిస్తే… ఎలా ఉంటుంది. చిరిగి చాటవుతుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అధికారం కోసం మూడు పార్టీలు కలిసి పోటీచేశాయి.. అనుకున్నది సాధించాయి. మరి ఐదేళ్లు కలిసే ఉంటాయా…? అన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే… కూటమిలోని పెద్దపార్టీలోనే అసంతృప్తి మొదలైపోయింది. అది ఎంత దూరం వెళ్తుందో ఏమో మరి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నా… ఆ మూడు పార్టీల మధ్య రోజుకో పంచాయితీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో… ఎవరికి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఏమో… తమ పార్టీని కరివేపాకులా తీసేస్తున్నారని.. ఒకటి, రెండు పదవులు ఇచ్చి మమ అనిపిస్తున్నారని వాపోతోంది. మరి.. పెద్ద పార్టీ టీడీపీ అయినా సంతృప్తిగా ఉందా..? అంటే అదీలేదు. అదేంటి… నామినేటెడ్ పదవుల్లో అగ్రభాగం టీడీపీదే కదా… ఇక అసంతృప్తి ఎందుకు అనుకుంటున్నారా…! అయితే వారి బాధేంటో ఒకసారి వినండి.
Also Read : అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులా – జగన్ జర భద్రం..!
కూటమిలో బలమైన పార్టీ టీడీపీ… ఆ పార్టీకి కేడర్ కూడా ఎక్కువే. అయితే…. మూడు పార్టీలు కలిసి అధికారం పంచుకుంటున్నాయి కనుక… నామినేటెడ్ పదవుల్లో మూడు పార్టీలకు భాగాలు పంచుతున్నారు. అగ్రభాగం టీడీపీ తీసుకున్నా… పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేయలేకపోకపోతోంది. పైగా… కొన్ని చోట్ల బలమైన టీడీపీ నేతలను పక్కనపెట్టి.. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి పదవులు ఇవ్వాల్సి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య… మొదలవుతోంది. పొత్తులో భాగంగా నియోజకవర్గాల్లో బలమే లేని జనసేన, బీజేపీ నేతలకు పదవులు వస్తున్నాయని… కష్టపడి పనిచేసి, ప్రజల్లో ఉంటున్న తమకు మాత్రం విలువ లేకుండా పోతోందన్నది టీడీపీ నేతల వర్షన్.
రాయలసీమ జిల్లాలో పర్యటించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముందు కూడా.. టీడీపీ క్యాడర్ ఇదే చెప్పుకొచ్చారట. వారి బాధ విన్న పల్లా… నిజమే అని ఒప్పుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతోంది.. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని క్యాడర్తో చెప్పారట. అయితే… మూడు పార్టీలు కలిసి అధికారం పంచుకుంటుంటే… అందరికీ న్యాయం చేయడం కల్లో మాట. మరి టీడీపీ క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలగా మారితే… వచ్చే ఎన్నికల పరిస్థితి ఏంటి…? మళ్లీ మూడు పార్టీలు కలిసి పనిచేసేందుకు టీడీపీ కేడర్ ఒప్పుకుంటుందా…? లేదా.. కూటమి కల్లాసవుతుందా…?
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్