హైదరాబాద్ లో మరో దారుణం: రైలు కిందపడి ఇద్దరు పిల్లలు, భార్య ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం జనవరి 31, 2026 తెల్లవారుజామున సుమారు 12:40 గంటల సమయంలో హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదంలోకి నెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయ, విజయశాంతి రెడ్డి దంపతులు బోడుప్పల్‌లోని హరితవనం కాలనీ నివాసితులు. వీరికి ఇద్దరు పిల్లలు, భర్త పిన్నింటి విజయ ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె ఇంటర్ సెకండియర్, కుమారుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు.

శనివారం తెల్లవారుజామున సుమారు 12:40 గంటల సమయంలో చర్లపల్లి – ఘట్‌కేసర్ మధ్య విజయ్ భార్య పిన్నింటి విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి (18), మరియు కుమారుడు విశాల్ రెడ్డి (17) ముగ్గురూ ఒకేసారి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన కారణంగా కొంతసేపు ఆ మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మృతదేహాలను తొలగించిన తర్వాత రైల్వే అధికారులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడం చెంగిచర్ల ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా ఇద్దరు యువకులు మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనపై ఊహాగానాలు చేయవద్దని పోలీసులు కోరారు. పోస్టుమార్టం నివేదికలు, ఇతర ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button