T20 WorldCup 2026: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరితంగా సాగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో భాగంగా జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చివరి వరకు నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినా.. మధ్యలో కీలక భాగస్వామ్యాలతో తిరిగి పోరులోకి వచ్చింది. 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని 2 వికెట్ల తేడాతో రోమాంచక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో సూపర్ 8లో ఇంగ్లాండ్ ఆశలు మరింత బలపడ్డాయి.
లక్ష్యచేసే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ అద్భుత శతకం బాది జట్టును ఒత్తిడిలో నుంచి బయటకు తీసుకువచ్చాడు. అతను సాధించిన 100 పరుగులు ఇంగ్లాండ్ విజయంలో కీలకంగా మారాయి. మరోవైపు విల్ జాక్స్ 25 పరుగులతో విలువైన సహకారం అందించి మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. చివరి దశలో వచ్చిన చిన్న భాగస్వామ్యాలు జట్టుకు ఊపిరి పోశాయి. అయితే పాకిస్తాన్ బౌలర్లు కూడా గట్టి పోరాటమే చేశారు. షహిన్ ఆఫ్రీది 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను తీవ్ర ఒత్తిడికి గురిచేయగా, ఉస్మాన్ తారిఖ్, నవాజ్ చెరో 2 వికెట్లు సాధించి మ్యాచ్ను చివరి వరకూ ఉత్కంఠభరితంగా మార్చారు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆరంభంలోనే దూకుడుగా ఆడిన ఓపెనర్ ఫర్హాన్ 63 పరుగులతో అర్ధశతకం సాధించి జట్టుకు మంచి పునాది వేశాడు. మధ్యలో బాబర్ అజాం 25, ఫఖర్ జమాన్ 25, షాదాబ్ ఖాన్ 23 పరుగులతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడినా, చివర్లో వికెట్లు వరుసగా పడిపోవడంతో భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగంలో డాసన్ 3 వికెట్లు తీసి పాకిస్తాన్ను కట్టడి చేశాడు. జోఫ్రా ఆర్చర్, జెమీ చెరో చెరో 2 వికెట్లు పడగొట్టి కీలక సమయాల్లో దెబ్బకొట్టారు. అలాగే ఆదిల్ రషీద్ 1 వికెట్ సాధించాడు. మొత్తంగా చూస్తే బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాకిస్తాన్ను 164 పరుగులకే పరిమితం చేయగలిగారు.
మొత్తం మ్యాచ్ ఆఖరి ఓవర్ల వరకూ ఉత్కంఠగా సాగింది. ఒక్కో వికెట్ పడినప్పుడల్లా ఫలితం మారిపోతుందేమోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చివరికి ఒత్తిడిని తట్టుకుని ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో సూపర్ 8లో ఇంగ్లాండ్ ముందడుగు వేసింది. ఇక పాకిస్తాన్కు మిగిలిన మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారుతుండటంతో రాబోయే పోరులు మరింత రసవత్తరంగా ఉండనున్నాయి.
ALSO READ: అన్లిస్టెడ్ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో రిలయన్స్ రిటైల్

