
క్రైమ్ మిర్రర్,నిర్మల్:- మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతా చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ తరహా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి, అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఎన్నికల కోడ్ను కచ్చితంగా అమలు చేయాలని, కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలని స్పష్టం చేశారు.
Read also : అరాచక శక్తులను తరిమి కొట్టండి.. బీజేపీకి పట్టం కట్టండి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Read also : Yumnam Khemchand: మణిపూర్ సీఎంగా ఖేమ్ చంద్, ప్రమాణం చేయించిన గవర్నర్ భల్లా!





