
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతి వాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని, అంతే కాకుండా మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అరెస్టు అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. 2022 లో హైకోర్టు శ్రీలక్ష్మి ని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఆ డిశ్చార్జ్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు మంగళవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్ రెడ్డి తో పాటు వి.బి. శ్రీనివాసరెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ లకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్ కు అదనంగా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విధించింది. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ కు రూ. 2 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు. వేర్వేరు సెక్షన్ల క్రింద వేర్వేరుగా ఏడేళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించిన శిక్షకు మినహాయింపు నిచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబిత, ఐఏఎస్ కృపానందం లను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది.