నేటి సాంకేతిక యుగంలో చిన్న వయసులోనే పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న పరిస్థితి ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు 90 రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సిద్ధం చేసి ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కూడా చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితులు విధించాలనే ఆలోచన జరుగుతుండగా, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ కూడా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగించాలి అనే అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వ్యసనాన్ని నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో చట్టం తీసుకురావాలని ఆయన కోరుతున్నారు.
చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలపై అధికంగా ఆధారపడటం వల్ల పిల్లల్లో అనేక మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత తగ్గిపోవడం, నిద్రలేమి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడపడం వల్ల చదువుపై దృష్టి తగ్గిపోతోందని కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వడపోత లేకుండా అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా హానికరమైన లేదా హింసాత్మక విషయాలకు పిల్లలు గురయ్యే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెరగడం, సైబర్ వేధింపులు వంటి సమస్యలు కూడా చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. పిల్లలను మళ్లీ ఆటపాటలు, శారీరక క్రీడలు, పుస్తక పఠనం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఈ అంశంపై విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపి తుది మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉందని సమాచారం.
ALSO READ: సర్పంచ్ భర్త దాష్టీకం.. కారుకు అడ్డొచ్చాడని దారుణంగా కొట్టారు
