జాతీయం

Army Chief: పాక్ కవ్వింపు చర్యలు.. భారత ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

ఆపరేషన్ సిందూర్ తర్వాత మళ్లీ పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు, ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన,  పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసినా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు.

సహరిద్దు సమీపంలోకి పాక్ డ్రోన్లు

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు.

జమ్మూకాశ్మీర్ లో సున్నిత పరిస్థితులు

జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా, ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయన్నారు ద్వివేది. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులను హతమార్చామని, వారిలో 65 శాతం మంది పాకిస్థాన్‌ సంతతి వారేనని తెలిపారు. వీరిలో ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపు లేవన్నారు. 2025లో కేవలం రెండే కేసులు ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికీ యాక్టివ్ ఉగ్రవాద శిబిరాలు

పాక్ లో ఇప్పటికీ ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు యాక్టివ్ గా ఉన్నాయ్నారు ద్వివేది. వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయన్నారు. ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలు ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  ఆపరేషన్ సిందూర్ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పని చేసిందనిన్నారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button