
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలని తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణలపై సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక నిందితులు రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్మెంట్ల ఆధారంగానూ సిట్ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ చెబుతోంది.
Also Read : సప్త సముద్రాల అవతల ఉన్న… వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మాజీ సీఎం జగన్
మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజ్ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.