
RRB: నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో మంచి అవకాశాన్ని తీసుకొస్తోంది. ఐసోలేటెడ్ కేటగిరీస్ విభాగంలో మొత్తం 311 పోస్టులను భర్తీ చేయనున్నట్లు RRB షార్ట్ నోటీస్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అవకాశం కావడం గమనార్హం.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు 2026 జనవరి 29 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఈ పోస్టులకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
ఈ నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో కీలక విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ సూపర్వైజర్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు కనీసం రూ.19,900 నుంచి గరిష్టంగా రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పే మ్యాట్రిక్స్ ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. పూర్తి అర్హతలు, విద్యార్హతలు, విభాగాల వారీ రిజర్వేషన్లు వంటి వివరాలతో త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.
అభ్యర్థుల ఎంపిక రెండు దశల ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా జరుగుతుంది. కొన్ని పోస్టులకు ట్రాన్స్లేషన్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. వీటితో పాటు మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం తుది ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్తో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం మరింత చేరువైంది.
ఖాళీల వివరాలు
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ – 15 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 39 పోస్టులు
చీఫ్ లా అసిస్టెంట్ – 22 పోస్టులు
జూనియర్ ట్రాన్స్లేటర్ – 202 పోస్టులు
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ – 24 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ – 7 పోస్టులు
సైంటిఫిక్ సూపర్వైజర్ – 2 పోస్టులు
ALSO READ: Leave Story: లవర్తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే..?





