HomeUncategorizedరేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్.. ఇద్దరు సీఎంల మధ్య ముదిరిన లేఖల యుద్ధం

రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్.. ఇద్దరు సీఎంల మధ్య ముదిరిన లేఖల యుద్ధం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైంది. విజయన్ రాసిన లేఖలోని భాషా శైలిని తప్పుబడుతూ రేవంత్ రెడ్డి అత్యంత ఘాటైన సమాధానం ఇచ్చారు. రాజకీయ విమర్శల్లో కనీస సంస్కారం ఉండాలని హితవు పలికారు. విజయన్ వాడిన పదజాలం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తాను మాత్రం అనాగరిక పదజాలం జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. మీరు తెలంగాణకు వస్తే అతిథి మర్యాదలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోనని రేవంత్ పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి కేవలం 28 నెలలే అయ్యింది. ఈ స్వల్ప కాలంలోనే రాష్ట్రం 10.1 శాతం జీఎస్డీపీ (GSDP) వృద్ధిని నమోదు చేసింది. జాతీయ సగటు 9.9 శాతాన్ని సైతం దాటేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. రూ.3.87 లక్షలకు చేరుకుంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు కేరళను కూడా తెలంగాణ వెనక్కి నెట్టిందని ఆర్బీఐ గణాంకాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేరళ అభివృద్ధి దశాబ్దాల క్రితం నాటిదని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన సవాల్ విసిరారు.

కేరళలో పేదరిక నిర్మూలనపై విజయన్ చేస్తున్న ప్రకటనల పట్ల రేవంత్ రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. 2025 నవంబర్ 1 నాటికి రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తొలగిపోయిందని మీరు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేటికీ 64,006 కుటుంబాలకు మైక్రో ప్లాన్లు అమలు చేస్తుండటంపై రేవంత్ వివరణ కోరారు. ఆ ప్రకటనను ఎవరైనా స్వతంత్ర సంస్థలు ధృవీకరించాయా అని నిలదీశారు. పేదరికం పోయిందని ట్వీట్లు చేయడం కాకుండా వాస్తవ పరిస్థితిని గమనించాలని సూచించారు.

అవినీతి రహిత పాలనపై విజయన్ చేస్తున్న వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి బలంగా తిప్పికొట్టారు. సీఎం కార్యాలయంతో సంబంధం ఉన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. శబరిమల ఆలయానికి చెందిన 4.5 కిలోల బంగారం మాయమైన ఉదంతంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళలో పరిపాలన పారదర్శకంగా ఉంటే ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తాయని ఆయన నిలదీశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ భవిష్యత్తుపై రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్ ప్రకటించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ లక్ష్యానికి వెన్నెముకగా నిలుస్తాయని తెలిపారు. కేరళ ప్రజలు త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగిన ఈ లేఖల యుద్ధం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొలిటికల్ గ్యాప్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

ALSO READ: ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు…రెండు కారిడార్లు అమ‌రావ‌తికి లింక్‌…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments