
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి నాలుక కోసేశాడు కొడుకు. నాలుక తెగడంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన తండ్రిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గత పది రోజులుగా రైతు బంధు నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తుంది. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి ఉంది. దీంతో ఆయనకు రైతు బంధు కింద 6 వేల రూపాయలు వచ్చాయి. ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఆ పైసలు జమ అయ్యాయి.
అయితే రైతు బంధు కింద వచ్చిన డబ్బులను తనకు ఇవ్వమని చిన్న కొడుకు తండ్రితో గొడవ పడుతున్నాడు. డబ్బు ఇవ్వమని తన చిన్న కొడుకు సంతోష్ అడగడంతో, ఆరోగ్యం బాగాలేక రూ.2000 ఖర్చు చేశానని మిగతా రూ.4000 ఇస్తానని చెప్పాడు తండ్రి కీర్యా. అయినా వినని చిన్నకొడుకు తండ్రిపై దాడికి తెగబడ్డాడు. తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేశాడు చిన్న కొడుకు సంతోష్ నాయక్. తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించ. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.