క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘ఫ్యూచర్ సిటీ’ (భారత్ ఫ్యూచర్ సిటీ) ప్రాజెక్టు పనులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) చెన్నై బెంచ్ నిరాకరించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటగా నిలిచింది. అన్ని పక్షాల వాదనలు వినకుండా, కౌంటర్లు దాఖలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు (Environmental Clearances) లేకుండానే ప్రభుత్వం ప్రాజెక్టు పనులు, టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టిందని పర్యావరణవేత్త ధోంతి నర్సింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఎటువంటి అక్రమ నిర్మాణ పనులు జరగడం లేదని ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.
చట్టప్రకారం అవసరమైన అన్ని అనుమతులు సరైన సమయంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసును జూన్ 9, 2026కి వాయిదా వేస్తూ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) మరియు కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ హైవేల మధ్య సుమారు 30,000 ఎకరాల్లో ఈ స్మార్ట్ సిటీని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
