Rahul Chahar: భారత క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహర్ తన వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు అధికారికంగా వెల్లడించారు. భార్య ఇషానీ జోహార్తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశం ద్వారా తెలియజేశారు. సుదీర్ఘ ఆలోచనల అనంతరం తీసుకున్న నిర్ణయమిదని, గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాను చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, ఆ సమయంలో తన వ్యక్తిత్వం, విలువలు, జీవిత దిశపై పూర్తి స్పష్టత లేదని రాహుల్ వెల్లడించారు. గత 15 నెలలుగా న్యాయపరమైన ప్రక్రియలో కొనసాగుతూ సహనం, నిజాయితీ, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని తెలిపారు. ఈ బంధాన్ని కోపంతో గానీ, బాధతో గానీ ముగించడం లేదని, సంపూర్ణ స్పష్టతతో ముందుకు సాగుతున్నానని తన సందేశంలో పేర్కొన్నారు.
కొన్ని సంబంధాలు జీవితంలో పాఠాలు నేర్పడానికే వస్తాయని, ఈ అనుభవాన్ని ఒక ముగింపుగా కాకుండా కొత్త ప్రారంభంగా స్వీకరిస్తున్నానని రాహుల్ వెల్లడించారు. ఆత్మగౌరవం, ప్రశాంతత, భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఎలాంటి చేదు అనుభవాలను మనసులో ఉంచుకోనని, పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రాహుల్ చాహర్, ఇషానీ జోహార్ బంధం నేపథ్యాన్ని పరిశీలిస్తే 2019లో జైపూర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. అనంతరం 2022లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిశ్చితార్థం నుంచి దాదాపు 4 ఏళ్ల ప్రయాణం అనంతరం పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 9న వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా, అంతకుముందే చట్టపరంగా విడిపోయినట్లు సమాచారం.
మైదానంలో తన స్పిన్ నైపుణ్యంతో అభిమానులను అలరించిన రాహుల్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు, క్రికెట్ వర్గాలు గౌరవిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలను గౌరవంతో వెల్లడించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ALSO READ: మున్సిపల్ పీఠం.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట
