
Putin Warning To America: ఇరాన్ పై అమెరికా దాడులను పలు దేశాలు సమర్థిస్తున్న నేపథ్యంలో.. రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓవైపు శాంతి దూతని అని చెప్పుకునే ట్రంప్, మిడిల్ ఈస్ట్ లో యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తున్నాడని మండిపడింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ అమెరికా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్ కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు రెడీగా ఉన్నాయన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులను రష్యా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అటు, ఆ దేశం అణు బాంబులను కలిగి ఉన్న నేపథ్యంలో దిమిత్రి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
శాంతిదూతగా చెప్పుకుంటూ దాడులా?
అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద మెద్వెదేవ్ విమర్శలు గుప్పించారు. మిడిల్ ఈస్ట్ లో ట్రంప్ యుద్ధానికి తెరలేపారని మండిపడ్డారు. తానో శాంతిదూతని అని చెప్పుకుని ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, ఇప్పుడు యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లోని ప్రజలు భయం గుప్పిట బతుకీడుస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో అమెరికా దాడులకు దిగి, యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు.
రష్యా అధ్యక్షుడితో ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సమావేశం
అటు అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సీరియస్ గా స్పందించింది. తమ దేశంలో అణు స్థావరాలపై దాడులు చేసిన శత్రువులకు తగిన గుణపాఠం చెప్తామని వెల్లడించింది. ఈమేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశామయ్యేందుకు మాస్కో వెళ్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నాడు ఫుతిన్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు. అదును చూసి తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు.
Read Also: ట్రంప్ మొదలుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!