•మాడ్గుల మండలం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి :-
మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో దిల్వార్ ఖాన్ పల్లి చెన్నకేశవ, ఆంజనేయ స్వామి దేవాలయ భూములు పట్టా మార్పిడి చేసి దేవునికే శఠగోపం పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇర్విన్ గ్రామ సమీపంలో అనుమతులు లేకుండా 27 గుంటల భూమిలో గ్రామానికి చెందిన ఒక వ్యాపారి దేవాలయ భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్నారని పలు పత్రికలో వార్త కథనం ప్రచురితం కాగా అందుకు స్పందించిన ఎండోమెంట్ అధికారులు సంబంధిత భూమిని పరిశీలించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడంతో దేవాలయ భూములు అన్యాక్రాంతం విషయం వెలుగులోకి వచ్చింది.
చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవాలయాల పేరిట సర్వే నంబర్ లు 11,19,20,929,988 లో 73 ఎకరాల 20 గుంటల భూమి రికార్డులలో నమోదయి ఉండగా సర్వే నెంబర్ 11లో 27 గుంటల భూమ వ్యాపారి అల్లంపల్లి రమేష్ ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది. ఇదే సమయంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఖాళీగా ఉన్న దేవాలయ భూములపై కన్నేసి రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుని దేవాలయములను అన్యాక్రాంతం చేస్తున్నట్లు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత తతంగం నడుస్తున్న ఎండోమెంట్ అధికారులు ఏం చేస్తున్నట్లు..?గత కొన్ని రోజుల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న వ్యాపారికి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఎండోమెంట్ అధికారులపై గ్రామస్తులు బాహాటకంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అన్యాక్రాంతం అవుతున్న దేవాలయ భూములను పరిరక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

