* గులాబీ పార్టీలో అంతర్గత విభేదాలను వాడుకుంటున్న రేవంత్
* బిజెపి ఎదగకుండా ఉండేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గట్టి ప్లాన్
* బండి సంజయ్ అనుమానం కూడా అదే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బిఆర్ఎస్ నేతల విషయంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? కేవలం హరీష్ రావు పైన ఎందుకు దృష్టి పెట్టారు? కేటీఆర్ పై ఎందుకు కనికరం చూపిస్తున్నారు? అంటే వారి మధ్య విభజన రేఖ గీయాలనా? అదే సీఎం రేవంత్ ముఖ్య ఉద్దేశ్యమా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ పొలిటికల్ పండితులు. పక్క వ్యూహంతోనే రేవంత్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
హరీష్ రావు టార్గెట్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే రేవంత్ వ్యూహాత్మకంగా హరీష్ రావును ఒంటరి చేస్తున్నారు అని అనుమానం కలుగుతుంది. కేటీఆర్ విషయంలో ఒకలా.. హరీష్ విషయంలో మరోలా సీఎం రేవంత్ వ్యవహార శైలి ఉంది. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసే విమర్శలు, విసిరే సవాళ్లు ప్రధానంగా హరీష్ రావు పైనే ఉంటున్నాయి. అయితే దీనిని సీక్రెట్ డీల్ గా చాలామంది అనుమానిస్తున్నారు. అయితే అటు బిజెపి సైతం కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్ష కోట్ల రూపాయల ప్రధాతనం వృధా అయ్యిందని పార్లమెంట్ వేదికగా ప్రకటించడం రేవంత్ కు అస్త్రంగా మారింది.
బాంబు పేల్చిన బండి సంజయ్..
మరోవైపు బండి సంజయ్ బాంబు పేల్చారు. హరీష్ రావు అవినీతిని ఎండగట్టారు కేంద్రమంత్రి. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పరిమితం చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందని సంజయ్ తేల్చి చెప్పారు. ఈ మూడు బ్యారేజీల వ్యవహారంలో హరీష్ రావు పాత్రను ఎత్తిచూపే అవకాశం ఉండడంతోనే విచారణను అక్కడితో ఆపేసారని అన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిన మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేయిస్తే కేసీఆర్ కుటుంబం ఇరుక్కుపోతుందనే భయం రేవంత్ లో ఉందని బిజెపి ఆరోపిస్తోంది. అందుకే హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీస్తే గులాబీ పార్టీ బలహీన పడుతుందని రేవంత్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే హరీష్ రావు ను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.
కఠిన చర్యలు ఏవి?
కేటీఆర్ విషయంలో చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. చాలా కేసులు తెరపైకి వచ్చాయి. కానీ ఎన్నడూ ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగలేదు. ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తోంది. డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేసింగ్ వివాదం, ఫామ్ హౌస్ కేసులు వంటి అంశాల్లో కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. కేటీఆర్, కవితల మధ్య రాజీ కుదిరించేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని.. ఆయనే మధ్యవర్తిత్వం వహిస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణలు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉందన్నది బండి సంజయ్ అభిప్రాయం. అంటే హరీష్ రావును నిర్వీర్యం చేస్తే గులాబీ పార్టీ బలహీన పడుతుందన్నది రేవంత్ ఆలోచనగా అర్థం అవుతుంది.
కార్నర్ బిజెపి..
ఈ మొత్తం సీన్ చూస్తుంటే తెలంగాణలో బిజెపి బలపడకూడదు అనే ఆలోచనలో భాగమేనని అర్థం అవుతోంది. తెలంగాణలో బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటవుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తన ప్రధాన ప్రత్యర్థుడిగా హరీష్ రావును ఎంచుకోవడం ద్వారా గులాబీ పార్టీలో అంతర్గత విభేదాలు వాడుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ హరీష్ రావు అవినీతి కేసుల్లో ఇరుక్కుపోతే కేటీఆర్ నాయకత్వానికి పోటీ లేకుండా చేయవచ్చు. అది అంతిమంగా ఆ పార్టీని మరింత బలహీనం చేస్తుందని అంచనా వేయవచ్చు. అయితే కేటీఆర్ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న మౌనం వెనుక ఏదో ఉందన్న అనుమానం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఉంది.
