అంతర్జాతీయం

PM Modi: పుతిన్ నివాసంపై మిసైల్స్ దాడి, ఖండించిన ప్రధాని మోడీ

రష్యాలోని నోవ్‌గరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతికి దౌత్యం ఒక్కటే సరైన మార్గమన్నారు. తాజా పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయని అన్నారు. శాంతి ప్రయత్నాలపైనే ఇరువర్గాలు దృష్టిసారించాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడి

రష్యాలోని నోవ్‌గరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై  సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని, 91 లాంగ్ రేంజ్ డోన్లను ఆ దేశం ప్రయోగించిందని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ధ్రువీకరించారు. అయితే వీటిని నిర్వీర్యం చేశామమని, ఇలాంటి చర్యల వల్ల రష్యా సంప్రదింపుల ప్రక్రియపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకుందని స్పష్టం చేశారు.

ట్రంప్ నివాసంపై దాడిని ఖండించిన ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి సంప్రదింపులు సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. తాను చాలా ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారు. పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి దాడి సమాచారం తెలియజేశారని అన్నారు. చైనా సైతం ఈ పరిణామంపై స్పందించింది. యుద్ధభూమిలో అగ్నికి ఆజ్యం పోయరాదని, ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ఇరుపార్టీలు కట్టుబడి ఉండాలని కోరింది. కాగా, దాడి సమయంలో పుతిన్ తన నివాసంలో ఉన్నారా? లేరా? అనేది వెంటనే తెలియలేదు.

దాడి వార్తలను ఖండించిన ఉక్రెయిన్

అటు పుతిన్ నివాసంపై దాడులకు సంబంధించి వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పూర్తిగా ఖండించారు. ఈ ఆరోపణ పూర్తిగా కట్టుకథగా కొట్టిపారేశారు. యుద్ధాన్ని ముగించడం రష్యాకు ఇష్టం లేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button