
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు నిరసన సెగ తగిలింది. గోదావరి జిల్లాల పర్యటన కోసం రాజమండ్రికి వెళ్లిన పవన్ ను ఎయిర్ పోర్టు దగ్గర కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్కు నిరసన తెలిపారు. మా బిడ్డ కనిపించడం లేదు.. మాకు ఇంకా న్యాయం జరగలేదు అని పవన్ కళ్యాణ్ సభలో ప్లకార్డుతో తల్లిదండ్రుల నిరసనకు దిగారు.
కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది మార్వాడి కుటుంబం. అయితే ఈనెల 8వ తేదీ నుంచి మార్వాడి దంపతుల కుమార్తె కనిపించకుండా పోయింది. అదృశ్యమైన బాలిక వయసు 14 ఏళ్లు .దీంతో తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది మార్వాడి కుటుంబం. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. పవన్ కల్యాణ్ కు కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చారు బాధితులు.
ఎయిర్పోర్ట్ బయట పవన్ రాక కోసం ప్లకార్డులు పట్టుకున్న మార్వాడి దంపతులన పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వస్తే ముందుకు వెల్లనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవనే తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.