India vs Pakistan T20: వెనక్కి తగ్గిన పాకిస్తాన్, భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకారం!
టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సస్పెన్స్ కు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే ఈ మ్యాచ్ జరగబోతోంది.
India–Pakistan T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే భారత్-పాక్ మ్యాచ్ జరుగనుంది. ఈనెల 15న భారత్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండాలని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాక్ జట్టుకు సూచించారు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్కు అడ్డంకులన్నీ తొలగినట్టయింది.
బంగాదేశ్ కు పాక్ మద్దతు
మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టుకు ఉద్వాసన పలకడంతో పాక్ క్రికెట్ బోర్డు వారికి మద్దతుగా నిలిచింది. దీనిలో భాగంగా ఈనెల 15న కొలంబోలో జరిగే మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో క్రికెట్ వర్గాలు షాక్కు గురయ్యాయి. ఈ మ్యాచ్ ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టర్ జియోస్టార్ కూడా ఈ నిర్ణయం కలవరపాటుకు గురి చేసింది. అటు స్టార్ న్యాయపరమైన చర్యలకు దిగుతానంటూ హెచ్చరించింది.
వెనక్కి తగ్గిన పాకిస్తాన్
శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా బాయ్కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా పాక్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. గతంలో పాక్ దేశంలో ఏ విదేశీ జట్టూ పర్యటించని పరిస్థితుల్లో తమ బృందాన్ని పంపిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే భారత్తో మ్యాచ్ ఆడకుంటే తాము కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది. భారత్తో మ్యాచ్ ఆడే విషయమై బంగ్లా, శ్రీలంక, యూఏఈ బోర్డులతో పాటు ఐసీసీ నుంచి కూడా ఒత్తిడి రావడంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి సానుకూల ప్రకటన రావడంతో టీ20 వరల్డ్ కప్ నకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్టయ్యింది. మరోవైపు భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ నకు దూరంగా ఉన్నందుకు బంగ్లాదేశ్ బోర్డుపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.









