
ఇప్పటి వరకు జాతీయ రహదారుల మీద ప్రయాణించే కార్లు మొదలుకొని భారీ వాహనాల వరకు టోల్ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ ఛార్జీ అనేది ఉండదు. అయితే, ఇకపై నేషనల్ హైవేల మీద వెళ్లే బైకులు కూడా టోల్ చెల్లించాలంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జులై 15 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో ద్విచక్రవాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ విమర్శలు చేశారు.
స్పందించిన నితిన్ గడ్కరీ
టూ వీలర్స్ కు టోల్ ఛార్జీల గురించి వస్తున్న వార్తలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తమకు అర్థం కావడం లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టూ వీలర్స్ కు నో ఛార్జీ
టూ వీలర్స్ కు ఎప్పటి లాగే లోట్ ట్యాక్స్ అనేది ఉండదని నితిన్ గడ్కరీ తెలిపారు. జులై 15నుంచి టోల్ వసూళు చేస్తారంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేయకూడదని నితిన్ గడ్కరీ హితవు పలికారు. అటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ వార్తలపై స్పందించింది. కొత్త టోల్ ఛార్జీ ప్రతి పాదన ఏదీ లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ అసత్య వార్తలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
Read Also: ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!