బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి ముందే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు ఆయన నివసిస్తున్న అన్నే మార్గ్-1లోని సీఎం అధికారిక బంగ్లా నుంచి, సర్క్యులర్ రోడ్డులోని అన్నే మార్గ్-7 వద్ద కొత్తగా కేటాయించిన నివాసానికి తన సామాను తరలించడం ప్రారంభించారు. శనివారం రోజు ట్రాక్టర్ల సహాయంతో కొంత సామాను అక్కడికి తరలించినట్లు సమాచారం. విశేషమేమిటంటే, ఈ కొత్త నివాసం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి సమీపంలోనే ఉంది.
రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణం
ఇక రాజకీయ పరంగా కూడా త్వరలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన సీఎం పదవికి గుడ్బై చెప్పే సమయం దగ్గరపడిందనే సంకేతాలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ నెల 13 లేదంటే 14 తేదీల్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముంది. అతని రాజీనామా అనంతరం, బిహార్లో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఈ నెల 15న నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ముఖ్య అతిథుల హాజరు ఆధారంగా తేదీలో మార్పు ఉండవచ్చని కూడా సూచనలు ఉన్నాయి.
లోక్ భవన్ లో కొత్త సీఎం ప్రమాణం
ప్రమాణస్వీకార కార్యక్రమం లోక్భవన్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావచ్చని సమాచారం. ముఖ్యంగా మోదీ హాజరవుతే, బిహార్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఆయన హాజరైనట్లు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని మరికొంత ఆలస్యంగా, అంటే ఏప్రిల్ 18న నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నితీశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవడం, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, ప్రమాణస్వీకారం వంటి అంశాలు బిహార్ రాజకీయాల్లో వేగంగా మార్పులకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
