
Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఏర్పడుతున్నాయి. యెమెన్ ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దు చేసిందని వార్తలు వస్తున్న వేళ, కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉరిశిక్ష రద్దు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఉరిశిక్ష రద్దు అంటూ ఏపీ అబూబకర్ కార్యాలయం ప్రకటన
నిమిష ప్రియ ఉరిశిక్షను యెమన్ సర్కారు రద్దు చేసినట్లు కాంతాపురం భారత గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. “నిమిష ప్రియ ఉరి శిక్షను రద్దు చేశారు. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేయాలని యెమన్ సర్కారు నిర్ణయించింది” అని ప్రకటించింది.అటు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు విషయాన్ని యెమెన్ లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి కూడా ధృవీకరించారు. అయితే, ఇవన్నీ అవాస్తవం అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
మహదీ కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న చర్చలు
మరోవైపు మరణశిక్ష రద్దు తర్వాత నిమిష ప్రియ విడుదలవుతుందా? లేదా? అనే చర్చలు కూడా జరిగాయి. ఉరిశిక్ష రద్దు అయినా, ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేదంటే బ్లడ్ మనీ ఇచ్చి విడుదల చేయించుకోవాల్సి ఉంటుందంటున్నారు. మృతుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో నిమిష కుటుంబం ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తూనే ఉన్నది. తొలుత నిమిషకు ఉరిశిక్ష పడాల్సిందే అని మహదీ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పినప్పటికీ, ఆ తర్వాత ముస్లీం పెద్దలు రంగంలోకి దిగడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు ఫలించి బ్లడ్ మనీ తీసుకుంటే, ఆమె విడుదల అయ్యే అవకాశం ఉంది.
Read Also: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు, యెమెన్ సర్కారు కీలక నిర్ణయం!