
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్/చెన్నై: యూట్యూబ్ వేదికగా పాపులర్ అయిన ‘భయ్యా సన్నీ యాదవ్’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు వెళ్లిన ఆయనను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేరుగా ఢిల్లీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న సన్నీ యాదవ్, రెండు నెలల క్రితం పాక్ టూర్కు వెళ్లి, అక్కడ తన యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, భారతీయ పౌరులు పాకిస్తాన్కు సంబంధించిన కంటెంట్ను షేర్ చేయవద్దని స్పష్టమైన అడ్వైజరీ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ విచారణ ప్రారంభించగా, టూర్ ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న సన్నీని చెన్నైలో అదుపులోకి తీసుకుంది. పది రోజుల క్రితం సన్నీ స్వగ్రామంలో అతడి ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టుగా సమాచారం. “ఆపరేషన్ సింధూర్” లాంటి సున్నితమైన భద్రతా సందర్భాల్లో, సన్నీ తన పాకిస్తాన్ టూర్ వీడియోలు ఎందుకు షేర్ చేశాడన్న కోణంలో ఎన్ఐఏ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో అరెస్టు చేయవద్దంటూ కోర్టును ఆశ్రయించిన సన్నీ, ఇప్పుడు మరో కేసులో చిక్కుకున్నట్టు స్పష్టమవుతోంది. ఆయన పాక్ టూర్ వెనుక ఎలాంటి కారణాలున్నాయో తెలుసుకోవడానికి ఎన్ఐఏ లోతుగా విచారించనుంది. ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదైనా, భద్రతా పరంగా సున్నితమైన విషయాల్లో సోషల్ మీడియా బాధ్యతగా వినియోగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.