
క్రైమ్ మిర్రర్, అమరావతి : చదువులు.. తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ఫీజులు కట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. బయట అప్పు చేస్తే… వడ్డీ భారం మామూలుగా ఉండదు. ఆ వడ్డీలు కట్టడం సామాన్యులకు కష్టమే. అందుకే ఏపీ ప్రభుత్వం సరికొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. డ్వాక్రా మహిళలకు… ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తోంది. మరి… లోన్ రావాలంటే ఏం చేయాలి…? ఎలాంటి అర్హతలు ఉండాలి…?
ఎన్టీఆర్ విద్యాసంకల్పం… ఇదే ఏపీ ప్రభుత్వం తెచ్చిన సరికొత్త స్కీమ్. ఈ పథకం ద్వారా కేవలం నాలుగు శాతం వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తోంది చంద్రబాబు సర్కార్. అయితే… ఇది డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే లభిస్తుంది. స్త్రీనిధి బ్యాంకు ద్వారా.. ఈ రుణాలను మంజూరు చేస్తారు. 10వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని… ఎన్టీఆర్ విద్యాసంకల్పం కింద పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని.. సులభ వాయిదాల్లో చెల్లించొచ్చు. LKG నుంచి PG చదివే విద్యార్థులకు.. ఈ పథకం వర్తిస్తుంది. సెర్ఫ్ ఆధ్వర్యంలో స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు అందించనుంది ఏపీ ప్రభుత్వం.
సాధారణంగా ప్రభుత్వం పెట్టే పథకాలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి వారికి మాత్రమే వర్తిస్తుంటాయి. కానీ… ఎన్టీఆర్ విద్యాసంకల్పం పథకం అలా కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ద్వారా లోన్ వస్తుంది. అయితే.. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. తీసుకున్న లోన్ను పిల్లల చదువుకు మాత్రమే వాడాలి. స్కూల్, కాలేజీ ఫీజులు రూపంలో గానీ.. లేదా చదువుకు అవసరమయ్యే కోర్సులు నేర్చుకునేందుకు గానీ.. లేదా.. పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు.. ఇలాంటి వాటికి మాత్రమే వినియోగించారు. దీనికి సంబంధించిన రసీదులు స్త్రీ నిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
నాలుగు శాతం వడ్డీ అంటే… చాలా తక్కువ. వడ్డీ పెద్దగా లేదు కనుక… పేదలపై వడ్డీ భారం పడదు. అంతేకాదు.. సులభ వాయిదాల పద్ధతి ఉండటంతో.. తీసుకున్న రుణం ఈజీగా తీర్చే అవకాశం ఉంటుంది. 10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తున్నారు. ఈ రుణాన్ని 24 నెలలు లేదా 36 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదల కుటుంబాలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుదని అధికారులు చెప్తున్నారు.