
Netanyahu On U.S Strikes: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అద్భుత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇదో సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. బలమైన శక్తి ద్వారానే శాంతి సాధ్యమని చెప్పిన నెతన్యాహూ.. అమెరికా శక్తివంతమైన చర్యలకు పూనుకుందన్నారు. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా స్పిరిట్ బాంబర్లతో దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “బలమైన శక్తితో శాంతి సాధ్యం అవుతుంది. ట్రంప్, నేను తరచుగా ఇదే విషయాన్ని చెప్తుంటాం. తాజాగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా బలమైన చర్యలు తీసుకుంది. శాంతికి పునాది వేసే ప్రయత్నం చేసింది” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తీసుకున్న నిర్ణయం చరిత్రను మలుపుతిప్పే ఘటనగా నెతన్యాహూ అభివర్ణించారు.
భూమ్మీద మరే దేశం చేయలేని సాహసం!
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పకడ్బందీగా ముందుకుసాగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. అమెరికా తన తాజాగా దాడులతో మరో కీలక ముందడుగు పడిందన్నారు. భూమ్మీద మరే దేశం చేయలేని సాహసం అమెరికా చేసిందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకర ఆయుధం అత్యంత ప్రమాదకర పాలకుల చేతిలో పడకుండా ట్రంప్ చర్యలు ఉన్నాయన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
ఇరాన్ లోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడులు
ఇరాన్ లోని ఫర్డూ, నాటనాజ్, ఎస్ఫహాన్ లోని మూడు కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో మూడు న్యూక్లియర్ సైట్స్ పెద్ద మొత్తంలో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఫర్డో న్యూక్లియర్ సైట్ మీద 6 బంకర్ బస్టర్ బాంబులను వేసినట్లు దాడి అనంతరం ట్రంప్ ప్రకటించారు. మిగతా రెండు సైట్ల మీద 30 టామహాక్ క్షిపణులను ప్రయోగించినట్టు వెల్లడించారు. ప్రపంచంలో మరే దేశ మిలిటరీ చేయలేని పనిని తాము చేశామన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అమెరికా సైనికులకు ఆయన అభినందనలు తెలిపారు. దాడుల తర్వాత అమెరికా యుద్ధ విమానాలు సేఫ్ గా తిరిగి వచ్చినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. దాడుల అనంతరం అన్ని అమెరికా విమానాలు క్షేమంగా తిరిగొచ్చాయని చెప్పారు.
Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వార్, ట్రంప్ సంచలన ప్రకటన!