తెలంగాణరాజకీయం

నా ప్రయాణం ఇక్కడితో ఆగదు – ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్,  క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ప్రముఖ విద్యావేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం తన పదవిపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే పై స్పందిస్తూ, “నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు” అని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, కానీ ఇది తుదితీర్పు కాదని అన్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, ఇతర నలుగురు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకంపై మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మీడియాతో మాట్లాడుతూ కోదండరాం, “కోర్టు స్టే మాత్రం ఇచ్చింది. మేము కౌంటర్ దాఖలు చేశాం. దీనిపై ప్రభుత్వమే చూసుకుంటుంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది” అన్నారు.

తాను ఎమ్మెల్సీగా ఎన్నుకోవబడటంతో తన ప్రజా సేవా ప్రయాణం మొదలైనదని భావించరాదని స్పష్టం చేస్తూ, “నా ప్రయాణం పదవులతో మొదలైంది కాదు. నేను విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా ఉద్యమాల వరకూ, ఎన్నో ఉద్యమాల మధ్య నుంచి రాజకీయానికి వచ్చాను. కాబట్టి ఈ నిర్ణయం వల్ల నా ప్రయాణం ఆగదు” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, రాజ్యాంగ పరిపాటిలో జరిగిన ప్రక్రియను న్యాయస్థానం సమీక్షిస్తోందని తెలిపారు. తుదితీర్పు వచ్చే వరకు నేను నా బాధ్యతలపై స్పష్టత కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

కోదండరాం పదవిపై స్టే రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నప్పటికీ, ఆయన సంయమనం పాటిస్తూ న్యాయ వ్యవస్థపై గౌరవం, రాజ్యాంగ ప్రక్రియలపై నమ్మకాన్ని వ్యక్తపరిచారు. “నా ప్రయాణం కేవలం పదవులకు పరిమితం కాదు. ఇది ప్రజల పక్షాన సాగుతున్న సేవా సంకల్పం” అనే సందేశం స్పష్టంగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button