క్రైమ్

Theft Case: 7 రూపాయల దొంగతనం కేసు.. 50 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు!

50 ఏళ్ల క్రితం నాటి 7 రూపాయల చోరీ కేసుకు సంబంధించి కోర్టు తుది తీర్పు వెలువడింది. ఎన్నో ఏళ్లు నిందితుల గురించి పోలీసులు వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఈ కేసుకు ముగింపు పలికింది.

50 Year Old Case Closed:  మహారాష్ట్రలో యాభై ఏళ్ల క్రితం నాటి ఓ చోరీ కేసుకు సంబంధించి ముంబై కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. ఎన్నో ఏళ్లు నిందితుల గురించి పోలీసులు వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఈ కేసుకు తాజాగా ముగింపు పలికింది. ఇంతకీ చోరీ అయిన మొత్తం ఎంతో తెలుసా.. 7.65 రూపాయలు.

అప్పట్లో సంచలనం!

50 ఏళ్ల క్రితం, అంటే 1977లో రూ. 7.65 అంటే కొంచెం పెద్ద మొత్తమే. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఎంత ప్రయత్నించినా నిందితులను మాత్రం పట్టుకోలేకపోయారు. దక్షిణ ముంబైలోని మజగావ్ న్యాయస్థానం తాజాగా పాత కేసులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 1977 నాటి రూ.7.65 కేసు వెలికి తీసింది. 1977 నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. రూ.7.65 చోరీ కేసులో అప్పట్లో ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు అందింది. ఆ ఇద్దరి కోసం పోలీసులు ఎంత గాలించినా, అనేక సార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది.

50 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్

దాదాపు 50 ఏళ్లుగా మరుగున పడి ఉన్న ఈ కేసు ఇటీవల విచారణకు వచ్చింది. ఈ కేసును పెండింగ్‌లో ఉంచడంలో అర్థం లేదని మజగావ్ న్యాయస్థానం అభిప్రాయపడింది. దాదాపు 50 ఏళ్ల నాటి ఈ కేసులో ఎటువంటి పురోగతీ లేకపోడంతో నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button