
తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. తెలంగాణ బీజేపీ రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించిన.. బలమైన బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ కు ఇవ్వాలని కమలం పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇవాళ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఆయన ఒక్కడే నామినేషన్ వేయనుండటంతో ఆటల రాజేందర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఆదివారం నిజామాబాద్ లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బహిరంగ సభ తర్వాత తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించారు. పార్టీ నేతలతో మాట్లాడిన అనంతరం ఈటల రాజేందర్ పేరును అమిత్ షా చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈటల రాజేందర్ కు అమిత్ షా చెప్పారని.. సోమవారం నామినేషన్ వేయాలని సూచించారని సమాచారం. అమిత్ షా ఆదేశాలతో నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.
తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు.. మహిళా కోటాలో డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రయత్నాలు చేశారు. అయితే బీసీ నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్ భావించడంతో ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ రేసులో నిలిచారు. అయితే తెలంగాణ ఉద్యమ నేతగా.. బీసీ వర్గాల్లో మంచి పట్టున్న.. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న ఈటల రాజేందర్ కు ఇస్తే పార్టీకి మరింత ప్రయోజనం కల్గుతుందని భావించిన బీజేపీ పెద్దలు.. ఈటలను నియమించారని చెబుతున్నారు.