
చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్):- చోరీకి గురైన సెల్ఫోన్ నుండి ఓ దొంగ బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ బస్ స్టాప్ లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలే లక్ష్మీనారాయణ (54), చౌటుప్పల్ నుంచి మునుగోడుకు వెళ్లడానికి బస్సు ఎక్కేందుకు చౌటుప్పల్ లోని ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాడు. మునుగోడు బస్సు రాగానే ఎక్కాడు. అనంతరం జేబులు పరిశీలించగా మొబైల్ ఫోన్ కనిపించలేదు. వెంటనే అతని సెల్ ఫోను దొంగిలించబడిందని గ్రహించి, అతను వెంటనే సమీపంలోని వ్యక్తుల ఫోన్ ల నుండి తన ఫోన్ కు కాల్ చేయడానికి ప్రయత్నించగా, అది స్విచ్ ఆఫ్ వచ్చింది.
మొబైల్ లో గూగుల్ పే, ఫోన్ పే ఉండడంతో వెంటనే అతని ఖాతా ఉన్న బ్యాంకుకు అనగా మునుగోడులోని కెనరా బ్యాంకు శాఖను సంప్రదించగా.. సెల్ఫోన్ చోరీ చేసిన దొంగ అప్పటికే విడతలవారీగా రూ. 30000, రూ. 40,000, రూ. 29,000, మొత్తం రూ. 99000 లను గూగుల్ పే స్కాన్ ఉపయోగించి అతని ఖాతా నుండి బదిలీ చేయబడిందని బ్యాంకు వారు తెలుపగా.. వెంటనే లక్ష్మీనారాయణ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు.