
MLA’s Offer: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ తన సన్నాహకాలను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రజల నమ్మకం సంపాదించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజాస్వామ్యపరంగా, గ్రామ కమిటీల నిర్ణయంతోనే జరిగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కడియం శ్రీహరి.. గ్రామ కమిటీలు, మండల కమిటీలు సూచించే పేర్ల ప్రకారం సర్పంచ్, ఇతర స్థానిక సంస్థల అభ్యర్థులు ఖరారవుతారని స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీ వరకు ప్రతి గ్రామం నుంచి రెండు నుండి మూడు పేర్లతో అభ్యర్థుల ప్రతిపాదనలు పంపాలని అధికారికంగా ఆదేశించారు.
అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి నజరానాగా రూ.10 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహిస్తే గ్రామ అభివృద్ధి నిధుల రూపంలో రూ.25 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులు గ్రామ అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ALSO READ: Telangana politics: బీఆర్ఎస్కు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు





