
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల కానుంది. మొత్తం 16,347 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఆ జాబితాలో ఉండనున్నాయి. ప్రభుత్వం ఈ నెల 19న అమరావతిలో భారీ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ సభలోనే ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్తగా నియామకమైన టీచర్లకు దసరా సెలవుల సమయంలో ట్రైనింగ్, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం పోస్టింగులు కేటాయించి, సెలవులు పూర్తయిన వెంటనే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే రోజున విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలోని విద్యారంగానికి కొత్త ఊపు లభిస్తుందని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ కావడంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుబాటులోకి రానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.