
Maoists Warning: మంత్రి సీతక్కకు మావోస్టులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె దగ్గర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ లాంటి కీలక శాఖలు ఉన్నప్పటికీ, వాటి ద్వారా ప్రజలకు ఫలాలు అందేలా చూడటం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా.. మంత్రిగా సీతక్క స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు మంత్రి సీతక్క ఆదివాసీల అవస్థల గురించి మాట్లాడ్డం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పెసా, 1/70 చట్టాలను సీతక్క మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
ఆదివాసీలను పట్టించుకోని మాజీ మావోయిస్టు
రేవంత్ రెడ్డి సర్కారులో కీలక మంత్రిగా కొనసాగుతున్న సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ బిడ్డ అయిన సీతక్క రాష్ట్రంలోని ఆదివాసీల అందరి బాధ్యతలు తీసుకోవాలన్నారు. జీవో నెంబర్ 49 పేరుతో కుమ్రం భీమ్ సహా పలు జిల్లాలో బోలెడు ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు సర్కారు ప్రయత్నిస్తుందన్నారు. జీవో నెంబర్ 49 కారణంగా మూడు జిల్లాల్లో ఆదివాసీలు కనుమరుగు కాబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ప్రకృతి వనరులను దోచిపెట్టేందుకే ఈ జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేసేలా సీతక్క చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల అయ్యింది.
Read Also: భాగ్యనగరంలో బోనాల సందడి.. భక్తులతో గోల్కొండ కోట కిటకిట!