కాకినాడ, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. స్వామి వారి ఆలయంలో ప్రస్తుతం ఉన్న గోశాలతో పాటు కొత్తగా మరో గోశాల ఏర్పాటు కానుంది. అందుకు 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గోశాలను ఏర్పాటు చేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ వెల్లడించారు.
ఆలయ ఛైర్మన్ ఎం.మణి నాయుడుతో కలిసి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పాలకమండలి సమావేశం నిర్వహించారు .అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తయారు చేసిన రూ.141.65 కోట్ల ఆలయ బడ్జెట్ అంచనాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
తవణంపల్లె మండలం కె.పట్నం వద్ద ఆలయానికి 18.60 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఆలయంలో భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద పని చేస్తున్న 109 మంది ఉద్యోగులను యథావిధిగా పాత పద్ధతిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్కు ఆలయ కమిటీ తరపున లేఖ రాస్తామని వివరించారు.
ఒంటిమిట్టలో….
ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం, డ్రై ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆలయాల్లో పరిచారకులుగా పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించే విషయమై ఏపీ ప్రభుత్వానికి నివేదించాలని డిసైడ్ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, ఆసుపత్రులు, సత్రాలు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని పరిపాలన భవనంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అందుకు రూ.10.75 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో నూతన ఎక్స్-రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.