
సాధారణంగా పెళ్లిళ్లకు కాగితపు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ తండ్రి తన కుమార్తె వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే సంప్రదాయానికి భిన్నంగా, ప్రపంచమే ఆశ్చర్యపోయేలా వెండితో తయారైన ఓ అద్భుత కళాఖండాన్ని పెళ్లి ఆహ్వాన పత్రికగా రూపొందించారు. జైపూర్కు చెందిన శివ్ జోహ్రి తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహం కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ ప్రత్యేక శుభలేఖను తయారు చేయించారు. దీని విలువ దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వెండి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
View this post on Instagram
ఈ వెండి శుభలేఖను సాధారణ కార్డు రూపంలో కాకుండా, ఓ అందమైన బాక్స్ ఆకారంలో రూపొందించారు. దీని పొడవు సుమారు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు, లోతు 3 అంగుళాలుగా ఉంది. మొత్తం నిర్మాణం 128 ప్రత్యేకమైన వెండి ముక్కలతో తయారైంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక్క మేకు, ఒక్క స్క్రూ కూడా ఉపయోగించకుండా ఈ మొత్తం కళాఖండాన్ని సిద్ధం చేయడం. ప్రతి వెండి ముక్కను ఎంతో నైపుణ్యంతో ఒకదానితో ఒకటి అమర్చారు. ఈ అపురూపమైన డిజైన్ను పూర్తి చేయడానికి శివ్ జోహ్రికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టింది.
ఈ వెండి వెడ్డింగ్ కార్డు పూర్తిగా హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఇందులో మొత్తం 65 మంది దేవతామూర్తుల ప్రతిమలను అద్భుతమైన శిల్పకళతో చెక్కించారు. శుభలేఖ పైభాగంలో గణపతి విగ్రహం దర్శనమిస్తుండగా, ఆయనకు కుడివైపున పార్వతీ దేవి, ఎడమవైపున శివుడు కొలువై ఉన్నారు. వీరి కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకాదు, శ్రీకృష్ణుడి లీలలు, విష్ణువు దశావతారాలు, దక్షిణ భారత శైలిలో కృష్ణుడి రూపం, ఎనిమిది ఆవులతో కూడిన దృశ్యాలను కూడా ఇందులో చెక్కారు.
బాక్స్ వెలుపలి భాగంలో అష్టలక్ష్ములు తమ పరివారంతో పాటు సూర్యభగవానుడితో దర్శనమిస్తారు. కార్డులో తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. వెనుక భాగంలో తిరుపతి వెంకన్న భారీ ప్రతిమ ఉండగా, పైభాగంలో సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు రూపొందించారు. కార్డు అంచుల వెంబడి ఏనుగులు, గుర్రాలు, నెమళ్లు వంటి జంతువుల బొమ్మలు, అలాగే 40 ఏనుగు ముఖాలను అద్భుతంగా చెక్కారు.
ఈ వెండి శుభలేఖలో ద్వారపాలకులు, చామరాలు వీస్తున్న సేవకులు, శంఖం, డప్పులు వాయిస్తున్న దేవతామూర్తుల రూపాలు మరింత శోభను చేకూర్చాయి. రాముని దర్బార్, శివ కల్యాణం, తిరుపతి ఆలయ ద్వారాలు, రాధాకృష్ణుల లీలలు, శేషనాగుపై పవళించిన విష్ణుమూర్తి వంటి పౌరాణిక ఘట్టాలు ఈ కళాఖండాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఈ దేవతామూర్తుల నడుమ వధువు శ్రుతి జోహ్రి, వరుడు హర్ష్ సోని పేర్లను అందంగా చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. కార్డు లోపల వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా శ్రద్ధగా చెక్కించారు.
ఈ సందర్భంగా శివ్ జోహ్రి మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. నా కూతురి పెళ్లికి బంధువులను మాత్రమే కాదు.. సకల దేవతలను కూడా ఆహ్వానించాలన్నదే నా కోరిక అని చెప్పారు. ఆరు నెలల పాటు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని, నా బిడ్డకు తరతరాలు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలు చూసి గర్వపడేలా ఏదైనా ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అందుకే స్వయంగా ఏడాది పాటు శ్రమించి ఈ వెండి శుభలేఖను తయారు చేశానని చెప్పారు. ఈ అపురూపమైన వెండి పెళ్లి పత్రికను లాంఛనంగా వరుడి కుటుంబానికి అందజేయనున్నారు.
ALSO READ: Cosmic Smile: నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూశారా?





