
నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- రహదారులపై రాత్రి వేళ ప్రయాణం అంటేనే ఒకప్పుడు భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం రెట్టింపవుతోంది. దీనికి ప్రధాన కారణం వాహనాలకు అమర్చుతున్న మిరుమిట్లు గొలిపే, ఎల్ఈడి (LED), ఫోకస్ లైట్లు. కంపెనీ ఇచ్చే సాధారణ లైట్ల కంటే ఎక్కువ వెలుతురు ఉండాలనే ఉద్దేశంతో, వాహనదారులు చేయించుకుంటున్న ఈ మార్పులు, ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
సాధారణంగా వాహనాల హెడ్ లైట్లు రోడ్డును స్పష్టంగా చూపించేలా అమర్చబడి ఉంటాయి. అయితే అదనంగా అమర్చుతున్న హై-ఇంటెన్సిటీ ఫోకస్ లైట్లు, ఎదురుగా వచ్చే వాహనదారులను తాత్కాలికంగా అంధులను చేస్తున్నాయి. ఎదురుగా వచ్చే తీవ్రమైన వెలుతురు వల్ల, డ్రైవర్ల కళ్లు బైర్లు కమ్మి, రోడ్డు పక్కన ఉన్న మలుపులు, పాదచారులు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేలపై ఈ లైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఒక్క క్షణం దృష్టి చెదిరినా వాహనం అదుపు తప్పి ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Read also : ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ కన్ఫామ్.. జట్టులోకి స్టార్ బౌలర్ ఎంట్రీ : కెప్టెన్ సూర్య
మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన తయారీదారులు నిర్ణయించిన సామర్థ్యం కంటే, ఎక్కువ వాటేజీ ఉన్న బల్బులను, అదనపు ఎల్ఈడి స్ట్రిప్స్ను వాడటం నేరం. అయినప్పటికీ, యువత స్టైల్ కోసం, మరికొందరు స్పష్టమైన వెలుతురు కోసమని, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ లైట్లను అమర్చుకుంటున్నారు.ప్రమాదాలను అరికట్టాలంటే కేవలం జరిమానాలు మాత్రమే సరిపోవు, వాహనదారుల్లో మార్పు రావాలని ప్రజలు భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫోకస్ లైట్లను వెంటనే తొలగించాలని, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎల్ఈడి లైట్ల వల్ల కలిగే అనర్థాలపై, డ్రైవర్లకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మనం వాడే మితిమీరిన వెలుతురు వేరొకరి ఇంట్లో చీకటి నింపకూడదని, ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలి. మార్పు కోసం అధికారుల ముందడుగు, ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.
Read also : Jaya Lalitha Veda Nilayam: వేలానికి జయలలిత ఇల్లు, ధర ఎంతో తెలుసా?





